
కదిరి, సెప్టెంబర్ 10: వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో కదిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లో పీఎం స్వనిధి లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వీధి వ్యాపారులు పీఎం స్వనిధి పథకం ద్వారా పొందే రుణాలు, వాటి ప్రయోజనాలు, డిజిటల్ లావాదేవీలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు పీఎం స్వనిధి రుణ మంజూరు పత్రాలను అందజేశారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదిరి మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ శ్రీరామరెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ ఉదయ్, కదిరి మెప్మా ఇన్చార్జ్ టీఎంసీ గిరీష్, సీఓ మురళీకృష్ణ మాట్లాడారు. వీధి వ్యాపారులు పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మెప్మా సీవోలు ఆంజనేయులు, కృష్ణమూర్తి, టీఎల్ఎఫ్ లీడర్లు, ఆర్పీలు, ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్లు వీర మారుతి, నీరజతో పాటు పలువురు వీధి వ్యాపారులు పాల్గొన్నారు.
వీధి వ్యాపారుల ఆర్థిక అభివృద్ధికి పీఎం స్వనిధి పథకం ఎంతో ఉపయోగకరమని, అర్హులైన ప్రతి వీధి వ్యాపారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.









